తిరుపతి స్విమ్స్ లో చదివే ఎన్నారై ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట

  • 5 ఏళ్లకు బదులుగా  నాలుగున్నర సంవత్సరాలకే ఫీజులు వసూలుకు నిర్ణయం
  • టీటీడీ ఈవోకు విజ్ఞప్తి చేసిన 2021-22 బ్యాచ్ విద్యార్థులు
  • ఎన్ఎంసీ నిబంధనల మేరకు టీటీడీ ఈవో సానుకూల స్పందన
  • భవిష్యత్ బ్యాచ్‌లకు కూడా ఇదే విధానం వర్తింపు
స్విమ్స్ అనుబంధ శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న ఎన్నారై విద్యార్థులకు టీటీడీ భారీ ఊరట కల్పించింది. ఇకపై ఐదేళ్లకు బదులుగా నాలుగున్నర సంవత్సరాలకే ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విద్యార్థులపై ఫీజుల భారం తగ్గనుంది.

శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి నాలుగున్నర సంవత్సరాలు కాగా, యాజమాన్యం ఐదేళ్ల పాటు ఫీజులు వసూలు చేస్తోంది. ఈ విషయంపై 2021-22 బ్యాచ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇటీవల టీటీడీ ఈవో ఎం. రవిచంద్రను కలిసి విజ్ఞప్తి చేశారు. కోర్సు వ్యవధికి అనుగుణంగానే ఫీజులు వసూలు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

విద్యార్థుల విజ్ఞప్తిపై స్పందించిన ఈవో, జాతీయ వైద్య కమిషన్ ఈ నెల 7న జారీ చేసిన నిబంధనలను పరిశీలించారు. అనంతరం, ఎన్నారై కోటా ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి నాలుగున్నర సంవత్సరాలకే ఫీజులు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని ఆమోదం (రాటిఫికేషన్) కోసం స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం ముందు ఉంచనున్నారు.

ప్రస్తుతం 2021-22 బ్యాచ్ విద్యార్థులు చివరి సంవత్సరంలో ఉండటంతో ఈ నిర్ణయం వారికి తక్షణమే వర్తించనుంది. భవిష్యత్తులో వచ్చే బ్యాచ్‌లకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

TTD
Tirupati
SVIMS
Sri Padmavati Medical College
MBBS
NRI
Tuition Fees
M Ravichandra
National Medical Commission
Medical Education

More Telugu News